ఏసీబీకి చిక్కిన జగిత్యాల డీటీవో, అతడి డ్రైవర్
నీపై కేసు నమోదు చేయకూడదంటే, జరిమానా వేయకూడదంటే..నాకు లంచం ఇవ్వు’ అంటూ ఫిర్యాదుదారుడిని డబ్బు డిమాండ్ చేసిన జగిత్యాల డిస్ట్రిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్తో పాటు అతడి డ్రైవర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రవాణా అధికారి ఇటీవల ఫిర్యాదుదారుడిపై కేసులు నమోదు చేయకుండా, జరిమానా విధించకుండా, తన మొబైల్ తనకు ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు అంత ఇచ్చుకోలేనని మొరపెట్టుకోగా.. డీటీవో ఆ మొత్తాన్ని రూ.35,000కు తగ్గించాడు. దీనిలో భాగంగా మొదటగా రూ.13,000ను డీటీవో ఈ నెల 4న ఫిర్యాదుదారుడి నుంచి తీసుకున్నాడు. మిగిలిన రూ.22,000ను ఫిర్యాదు దారుడు బుధవారం డీటీవో డ్రైవర్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీటీవో తో పాటు అతడి డ్రైవర్పై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. కరీంనగర్లో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.