Prabhakar Rao: తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావు (Prabhakar Rao)సిట్ ఎదుట లొంగిపోయారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్కు ఆయన వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. అదేవిధంగా, ఆయనపై కస్టోడియల్ విచారణ జరపడానికి కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ అక్రమ కార్యకలాపాలకు ఎస్ఐబీ ప్రధాన కేంద్రంగా పనిచేశిందని, దీన్నంతా ప్రభాకర్రావు పర్యవేక్షించారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదైన సమయంలో అమెరికాలో ఉన్న ప్రభాకర్రావు ముందస్తు బెయిలే ఇస్తే భారత్కు వస్తానని హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరణ ఎదురైంది. దానిని సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఆయనకు తాత్కాలిక రక్షణ లభించింది. అనంతరం దేశానికి తిరిగొచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వరుసగా మూడోరోజు పిటిషన్ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభాకర్రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. విచారణలో జస్టిస్ మహదేవన్ తీవ్ర ప్రశ్నలు సంధించారు. “36 హార్డ్ డిస్కులు తొలగించారని ప్రభుత్వ ఆరోపణ. మీకు ఆదేశాలు ఎవరు ఇచ్చారు? తప్పు చేయకపోతే డేటా ఎందుకు చెరిపేశారు? పాస్వర్డ్లు గుర్తులేదనడం ఎలా?” అంటూ ప్రశ్నల వరుసను కొనసాగించారు. హార్డ్ డిస్కుల్లో డేటా డిలీట్ చేయమని ఎవరైనా లిఖితపూర్వకంగా ఆదేశించారా? ఉంటే కోర్టుకు సమర్పించాలని సూచించారు. రంజిత్కుమార్ “అన్నీ అఫిడవిట్లో వివరించాం” అని చెప్పగా, ధర్మాసనం అతని వాదనను అంగీకరించలేదు. కస్టోడియల్ విచారణ అవసరమేనని వ్యాఖ్యానించింది.
ప్రభాకర్రావును రాజకీయ కారణాలతో ఇరికించారని రంజిత్కుమార్ వాదించారు. ఏ-2 నుంచి ఏ-6 వరకు ఉన్న ఇతర అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరైనదీ దీనికి నిదర్శనమని తెలిపారు. ఎస్ఐబీ పనితీరు వామపక్ష తీవ్రవాదంపై నిఘా ఉంచడం అని, ప్రభుత్వం అప్పగించిన విధులు మాత్రమే ప్రభాకర్రావు నిర్వహించారన్నారు. అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం దీనిని తీవ్రంగా ప్రతిఖండించారు. రాజకీయ నాయకులే కాదు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి అని వాదించారు. దీనికి సంబంధించి ఆధారాలేమీ లేవని రక్షణ వాదులు చెప్పారు. ప్రభాకర్రావు విచారణకు పూర్తిగా సహకరించడం లేదని, హార్డ్ డిస్కుల ధ్వంసం, డేటా డిలీట్ విషయాల్లో కీలక నిజాలు బయటపడాల్సి ఉన్నాయని సిట్ ప్రత్యేక న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా రక్షణ తరఫు, పాస్వర్డ్లు రీసెట్ చేసి ఇచ్చామని, రెండు డివైజ్ల నుంచి భారీ స్థాయిలో (19GB, 25.9GB) డేటా స్వాధీనం చేసుకున్నారని వాదించింది.
