సిట్కు ప్రభాకర్రావు తలనొప్పి
విచారణకు సహకరించడం లేదంటూ నిట్టూర్పు
‘మొండి కాదు.. బాబోయ్ జగమొండి.. అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి ఒక పదం సమాధానం.. కొన్నింటికి మౌనం.. ఎన్నిగంటలు కూర్చోబెట్టినా ఇదే తంతు’ అంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(Special Investigation Team)వాపోతున్నది. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone taping case)లో ఏ1 నిందితుడు (A1 accused person) ప్రభాకర్రావు (Prabhakar Rao) వ్యవహరిస్తున్న తీరు అని తెలుస్తున్నది. ఆయన సిట్ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, దీంతో సుప్రీంకోర్టు
గతంలో ఆయనకిచ్చిన రిలీఫ్ను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు, అలాగే నాంపల్లి కోర్టును కస్టోడియల్ విచారణ కోరనున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు గురువారం నాలుగోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సిట్ ప్రభాకర్రావుకు పలు కీలక ప్రశ్నలు సంధించారు.
వాటికి ఆయన సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్లు, పదే పదే ఒకే సమాధానం చెబుతున్నారని తెలిసింది. అలాగే 600 మంది ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపైనా సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు వంటి ఇతర నిందితులు, సాక్షుల నుంచి సేకరించిన స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
ఇప్పుడు నాలుగో విచారణలో, ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించి చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. మావోయిస్టుల సానుభూతిపరుల ముసుగులో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్రావును ఓఎస్డీగా నియమించి, ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీగా వ్యవహరించే అధికారం కట్టబెట్టడంపై కూడా సిట్ విచారణ చేస్తోంది.