కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్షా సమీక్ష
నేడు గెజిట్ నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వం(Central Government) జనగణన(Census) చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నది. 2011 తర్వాత, అంటే 16 సంవత్సరాల తర్వాత మళ్లీ జనగణన జరగబోతుందన్న మాట. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనాభా గణన. ఈ జనగణన రెండు దశల్లో జరుగుతుందని తెలుస్తున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Central Home minister Amith Shah) ఆదివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్,
కేంద్ర జనాభా లెక్కల కమిషనర్ మృతుంజయ్ కుమార్ నారాయణ్, ఇతర సీనియర్ అధికారులతో జనగణనపై సమీక్షించారు. అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ లోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో జన గణన జరుగుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాలలో జరుగుతుందని, ప్రక్రియకు సంబంధించిన అధికారిక గెజిట్ సోమవారం ప్రచురిస్తామని తేల్చిచెప్పారు.
మొదటి దశలో హౌస్లిస్టింగ్ ఆపరేషన్ ఉంటుందని, ఈ దశలో ప్రతి ఇంట్లో ఆర్థికపరమైన అంశాలు, వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలపై ఎన్యూమరేటర్లు సర్వే చేయనున్నారు. రెండో దశలో జనాభా గణన జరుగనున్నదని, దీనిలో ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు, వారి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తారు. జనాభా లెక్కింపులో కుల గణన కూడా జరుగుతుందని సమాచారం.
జనగణన కోసం కేంద్రం దేశవ్యాప్తంగా 34 లక్షల మంది సూపర్వైజర్లు సహా ఎన్యూమరేటర్లను నియమించనున్నది.