Donald Trump: భారత్(India)తో వాణిజ్య సంబంధాల(Trade relations)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు(Oil from Russia) కొనుగోలు విషయంలో అమెరికాకు సహకారం అందించకపోతే, భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనపు టారిఫ్లు విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన హెచ్చరించారు. ఓ బహిరంగ సభలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో ప్రస్తావించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, “రష్యా చమురు విషయంలో భారత్ మాకు సహాయం చేయకపోతే, మేము వారి ఉత్పత్తులపై టారిఫ్లు పెంచవచ్చు” అని ట్రంప్ అన్నారు.
ఈ వ్యాఖ్యలను ఆయన భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలతో అనుసంధానించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, దిగుమతులు–ఎగుమతులపై చర్చలు సాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో భారత్–రష్యా ఇంధన సంబంధాలపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, రష్యా చమురు కొనుగోళ్ల అంశం ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తుండటం తెలిసిందే. ఇదే అంశాన్ని ట్రంప్ విమర్శల లక్ష్యంగా చేసుకున్నారు. ఇదే విషయంపై గతంలోనూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒక సందర్భంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ఆ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం అప్పట్లోనే ఖండించింది. ప్రధాని మోదీతో ట్రంప్ మధ్య అలాంటి చర్చ జరగలేదని, రష్యా చమురు అంశంపై భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హంగా మారింది. అమెరికా రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో, అంతర్జాతీయ వాణిజ్యం మరియు ఇంధన విధానాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో భారత్–అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. వాణిజ్య భాగస్వాములుగా ఇరు దేశాలు సన్నిహితంగా ఉన్నప్పటికీ, రష్యా చమురు అంశం మాత్రం దౌత్యపరమైన సవాలుగా కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
