ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లపై అవినీతి మరకలు
మాజీ ఈఎన్సీ హరిరాం, ఈఈ శ్రీధర్ నివాసాల్లో ఏసీబీ దాడులు
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Project)కుంగుబాటులో పీసీ ఘోష్ కమిషన్ విచారణ, అదాయానికి మించి అక్రమాస్తుల(Illeagal properties) అంశంలో అవినీతి నిరోధకశాఖ (Anti corruption bureau) విచారణ.. ఇంజనీర్లలో దడ పుట్టిస్తున్నది. ఇప్పటికీ కాళేశ్వరం పరిధిలోని పనిచేసిన ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్(ENC Hariram)కు చెందిన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తులు గుర్తించింది.
వారం రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో 6, 7, 8 ప్యాకేజీలు పర్యవేక్షించిన ఈఈ నూనె శ్రీధర్(EE Sridhar) నివాసాల్లో దాడులు నిర్వహించింది. సుమారు రూ.150 కోట్ల విలువైన లెక్క తేలనని ఆస్తులను గుర్తించింది. ఇప్పటికే ఘోష్ కమిషన్ ఎదుట అనేక మంది ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీబీ దాడులు ఎదుర్కొనే నెక్స్ట్ ఇంజినీర్ అనే ప్రశ్న.. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నది.
ఈఈ నూనె శ్రీధర్కు చెందిన అక్రమ ఆస్తులపై..
ఈఎన్సీపై దాడులు మరచిపోకముందే గత వారంలో ప్రాజెక్ట్ పరిధిలో 6, 7, 8 ప్యాకేజీలను పర్యవేక్షించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) నూనె శ్రీధర్కు సంబంధించిన నివాసాలు, బంధువులు, సన్నిహితుల ఇండ్లలో మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది. దాడులు చేసిన ఇండ్లు, ప్లాట్లు, ఖరీదైన విల్లాలు హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. అలాగే 16 ఎకరాల భూమిని కూడా ఏసీబీ గుర్తించింది.
వీటన్నింటి విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది. ఈఈ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ పెద్ద పెద్ద మోటర్లు ఏర్పాటు, సర్జ్పూల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీగా ఆస్తులు వెనుకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఇప్పుడు ఈఈకి సంబంధించిన బ్యాంక్ లాకర్లను తెరిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
అందుకు సంబంధించిన అనుమతులు తీసుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. లాకర్లలో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు బయటపడే అవకాశం ఉందని, అవన్నీ లంచంగా స్వీకరించినవే అయి ఉంటాయని ఏసీబీ భావిస్తున్నది. శ్రీధర్ స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం.
ఇంజినీర్లలో కలవరం..
మెడిగడ్డ బరాజ్ కుంగుబాటు తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టింది. తర్వాత ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ రంగంలోకి దిగింది. వంద మందిపైగా బాధ్యులను విచారించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది.
పనులు చేపట్టిన ఎల్అండ్టీ సంస్థపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే 33 మంది ఇంజినీర్ల పేర్లను సైతం ప్రస్తావిస్తూ, వారికి జరిమానా విధించాలని పేర్కొన్నది. ఘోష్ కమిషన్ విచారణ, వరుసగా ఏసీబీ దాడుల కారణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగస్వాములైన ఇంజినీర్లలో కలవరం మొదలైంది.