స్థానిక ఎలక్షన్స్పై మంత్రులు పొంగులేటి, సీతక్క వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ గుస్సా
అధికార పార్టీ కాంగ్రెస్(Congress Government)లో స్థానిక ఎన్నికల(Local body elections) పంచాయితీ నడుస్తున్నది. క్యాబినెట్ నిర్ణయం(Cabinet Judgement) తీసుకోకుండానే మంత్రులు పొంగులేటి, సీతక్క(Ministers Ponguleti, Seethakka) ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని సభా వేదికలపై ప్రకటించడం విమర్శలకు దారి తీసింది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ గుస్సా అయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల అంశం ముడిపడి ఉందనే విషయాన్ని మంత్రులు గుర్తించాలని హితవు పలికారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అనాలోచితంగా మంత్రులు ప్రకటించడంపై పీసీసీ చీఫ్తోపాటు పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఆదివారం ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పాలేరులో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశమై ‘క్యాబినెట్లో చర్చించాక స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై స్పష్టత ఇస్తాం. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఎన్నికలకు ఇక 15 రోజుల గడవు మాత్రమే ఉంది’ అని ప్రకటించేశారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు.
జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుందని, ఆ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రుల వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. ‘నేను స్థానిక సంస్థల ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పాను. ఎన్నికల నోటిఫికేషన్ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు.
క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా నేను ఎన్నికలపై మాట్లాడను’ అని, తన మాటలను కొందరు వక్రీకరించారని ఆమె చెప్పుకొచ్చారు.