KTR: హైదరాబాద్ (Hyderabad)నగరంలోని ప్రజారోగ్యం (public health)పూర్తిగా అపరిశుభ్రత, అధికారుల అలసత్వపు మధ్య తేలిపోతుందన్న ఆరోపణలతో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్ (Banjara Hills)
లోని గురుబ్రహ్మ నగర్ బస్తీ దవాఖానా(Gurubrahma Nagar Basti Hospital)ను సందర్శించిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. నగరం కూపమండూకమవుతోంది. చెత్తతో నిండిపోయిన వీధులు, జీతాలు లేక ఆసుపత్రుల్లో తలపట్టుకుంటున్న వైద్యులు ఇదీ వారి పాలన ప్రతిబింబం అని కేటీఆర్ మండిపడ్డారు.
టిడియాగ్నోస్టిక్స్పై గండం, బస్తీ దవాఖానాల్లో జీతాల యాతన
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రారంభమైన ప్రజాహిత పథకాల్లో ‘టీ-డియాగ్నోస్టిక్స్’ ఒక కీలకమైన ఆరోగ్య యజ్ఞంగా నిలిచింది. ఉచిత పరీక్షల ద్వారా లక్షలాది మంది ప్రయోజనం పొందారు. అయితే, ప్రస్తుతం ఈ పథకాన్ని పక్కన పెట్టడమే కాకుండా, బస్తీ దవాఖానాల వైద్యులకు నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. మేము నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం వారికేం ముఖ్యం కాదు. త్వరలోనే టిమ్స్ ఆసుపత్రుల వద్ద ప్రజా ఉద్యమం ప్రారంభిస్తాం. ధర్నాతో ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాం అని ఆయన హెచ్చరించారు.
దానం నాగేందర్పై సెటైర్లు, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా మాజీ మంత్రి దానం నాగేందర్పై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు బాగా తెలుసు. కాని స్పీకర్ ముందు మాత్రం తాను పార్టీ మారలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ లోకి ఆయన పేరు చేర్చడమంటే ప్రజలను మోసం చేయడమే అని ధ్వజమెత్తారు. అంతేకాక, ‘‘ఏఐసీసీ అంటే అఖిల భారత అవినీతి కమిటీ’’ అంటూ కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ చేపట్టబోయే ఉద్యమాలు మరింత వేగవంతం కానున్నాయని ఈ పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రజల సమస్యలపై కేంద్రంగా నిలబడి మళ్లీ ప్రజల మద్దతును పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
