Gold price: దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు (Gold price)తాజాగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నమోదైన ధరల పతనం ప్రభావం దేశీయంగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ ట్రేడింగ్లో (Hyderabad Bullion Trading)10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు రూ.1.25 లక్షల వద్ద ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1.14 లక్షలకు చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.1.56 లక్షలుగా నమోదైంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో వచ్చే మార్పులు దేశీయంగా ప్రభావం చూపుతాయి. ఈ నెల 13వ తేదీతో పోలిస్తే బంగారం ధర దాదాపు రూ.5 వేల మేర తగ్గడంతో కొనుగోలుదారుల్లో కొంత ఆసక్తి పెరిగినప్పటికీ, మార్కెట్ దిశ మాత్రం అనిశ్చితంగానే కనిపిస్తోంది.
అదే సమయంలో వెండి కిలో ధర సుమారు రూ.1.70 లక్షల నుంచి రూ.15 వేల మేర పడిపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్సుకు బంగారం ధర 4200 డాలర్ల నుంచి 4010 డాలర్ల వరకు క్షీణించగా, వెండి ఔన్సు 49 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధరల ఆధారంగా దేశీయ ధరలూ తగ్గాయి. బంగారం ధరల పెరుగుదల, పతనాల్లో అమెరికా వడ్డీ రేట్లకు కీలక పాత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే డాలర్ బలపడుతుంది. అదే ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని అవసరానికి తగ్గట్టు కొనుగోలు అమ్మకాలు చేస్తారు. ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో వడ్డీ రేట్ల కోతపై ఉన్న అంచనాలు తగ్గిపోవడం వల్ల పసిడిపై డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. దీనితో డాలర్ ఇండెక్స్ కూడా బలపడింది.
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగిసిన నేపథ్యంలో ఈ వారం కీలక ఆర్థిక సూచికలు విడుదల కానున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుధవారం ప్రకటించుకోగా, సెప్టెంబర్ నెల ఉద్యోగాల గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. ఈ వివరాలు ఫెడ్ ముందున్న వడ్డీ రేట్ల నిర్ణయంపై స్పష్టత ఇస్తాయి. దీంతో బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయనే అంశంపై మార్కెట్ పాల్గొనే వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వడ్డీ రేట్లలో వచ్చే నెలలో మరోసారి కోత ఉంటుందని మొదట అంచనా వేయబడినప్పటికీ, ఫెడ్ అధికారులు మాత్రం ఇప్పటికి అలాంటి అవకాశాలను కొట్టిపారేశారు. దీంతో బంగారం ధరలు సమీప కాలంలో భారీ మార్పులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
