end
=
Wednesday, March 11, 2026
వార్తలుజాతీయం‘ఆపరేషన్ కగార్’ ఎన్‌కౌంటర్లపై దండకారణ్య జోనల్ కమిటీ సంచలన ఆరోపణలు
- Advertisment -

‘ఆపరేషన్ కగార్’ ఎన్‌కౌంటర్లపై దండకారణ్య జోనల్ కమిటీ సంచలన ఆరోపణలు

- Advertisment -
- Advertisment -

Encounter :‘ఆపరేషన్ కగార్’ పేరుతో జరుగుతున్న చర్యల్లో ఇటీవల చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ల (Encounter) పై మావోయిస్టు పార్టీ(Maoist Party) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(Dandakaranya Special Zonal Committee) ఓ లేఖను విడుదల చేసి పలు ఆరోపణలు చేసింది. వికల్ప్ అనే పేరుతో వెలువడిన ఈ లేఖలో, తమ కీలక నాయకుడు హిడ్మాతో పాటు మరికొందరిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హతమార్చారని ఆ కమిటీ పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్లు పూర్తిగా నాటకమని, ముమ్మాటికీ బూటకమని వారు ఆరోపించారు. లేఖ ప్రకారం, అనారోగ్య చికిత్స కోసం హిడ్మా నవంబర్ 15న విజయవాడకు వచ్చినప్పుడు ఏపీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారంటూ కమిటీ ఆరోపించింది.

అనంతరం మూడు రోజులపాటు విచారణ పేరుతో హింసకు గురిచేసి, నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారని వారి అభిప్రాయం. ఇదే ఆపరేషన్‌లో భాగంగా రంపచోడవరం పరిధిలో మరొక ఎన్‌కౌంటర్ జరిగినట్లు, ఇందులో కలిపి మొత్తం 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, 50 మందిని పోలీసులు అరెస్టు చేశారని వారు పేర్కొన్నారు. హిడ్మా కదలికలపై సమాచారం ఇచ్చింది లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ అని కమిటీ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు విజయవాడకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా కీలక పాత్ర పోషించారని లేఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో కేంద్ర–రాష్ట్ర నిఘా సంస్థలు కలిసి ఈ ఆపరేషన్‌ను అమలు చేశాయని కమిటీ విమర్శించింది.

ఇక, హిడ్మా మరణానికి మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కమిటీ, ఇవన్నీ పార్టీపై అపనిందలు మోపేందుకు చేస్తున్న కుట్రలో భాగమని స్పష్టం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో భిన్నాభిప్రాయాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొంది. ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని, హిడ్మా సహా మరణించిన వారిపై న్యాయపరమైన విచారణ జరగాలని కమిటీ డిమాండ్ చేసింది. అదేవిధంగా అరెస్టు అయిన 50 మందికి న్యాయ సహాయం అందించేందుకు హక్కుల సంఘాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు భయపడకుండా, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, తమ ఉద్యమానికి అండగా నిలవాలని పిలుపునిచ్చింది. ఈ లేఖ వెలుగులోకి రావడంతో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై మరోసారి చర్చ మొదలైంది. అధికారిక వర్గాలు తమ స్పందన వెల్లడించాల్సి ఉంది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -