Telangana Rising Global Summit: ‘తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీ(Future City)లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరై మెరుగు పరచారు. సదస్సు ఆరంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సినీ ప్రపంచం నుంచి ప్రముఖ నటుడు నాగార్జున ప్రత్యేక అతిథిగా హాజరుకావడం ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణ తెచ్చింది. వివిధ సంస్థల ప్రతినిధులు, కార్పొరేట్ నాయకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు ముందుకు వచ్చారు.
మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సమిట్కు విచ్చేయడం రాష్ట్రానికి గౌరవంగా నిలిచింది. సదస్సు ప్రారంభానికి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శన స్టాళ్లను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేస్తూ, తెలంగాణ అభివృద్ధి విధానాలను ఆకర్షణీయంగా ప్రజలకు పరిచయం చేయాలని సూచించారు. అనంతరం సీఎం తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఈవెంట్కు నాంది పలికారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ సమిట్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
దేశం–విదేశాల నుండి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యే నేపథ్యంలో ప్రత్యేక అతిథి సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లు, సెక్యూరిటీ వ్యవస్థను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఈ రెండు రోజుల సదస్సులో తెలంగాణలో ప్రజాపాలన సంస్కరణలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు ప్రధాన అంశంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘విజన్ 2047’ డాక్యుమెంట్ లక్ష్యాలు, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం కోసం రూపొందించిన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి విశదీకరించనున్నారు. ‘తెలంగాణ రైజింగ్’ సమిట్ ద్వారా రాష్ట్ర సామర్థ్యాలు, అవకాశాలు, పెట్టుబడి సౌకర్యాలు అంతర్జాతీయ వేదికపై మరింత ప్రాధాన్యం పొందనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు మంగళవారం వరకూ కొనసాగనుంది.
