Nara Lokesh: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల(International investment)ను రప్పించేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన అమెరికా పర్యటన(America tour) కీలక దశకు చేరుకుంది. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ కాలంలో ఏపీని తదుపరి ఇన్నోవేషన్ కేంద్రంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో, ఆయన అమెరికాలోని పలువురు ప్రముఖ సంస్థల టాప్ అధికారులతో ప్రతిపాదనలు పంచుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతిని ప్రపంచస్థాయి టెక్ డెస్టినేషన్లుగా మార్చే అవకాశం ఉందని వివరించి, భవిష్యత్ సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
విశాఖను డేటా నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం
శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జడ్స్కేలర్ సంస్థ సీఈవో జే చౌదరితో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే “డేటా సిటీ”గా గుర్తింపు పొందుతున్న విశాఖపట్నంలో గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, సైబర్ సెక్యూరిటీ రంగానికి కావాల్సిన పరిశోధన, డెవలప్మెంట్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ రంగంలో గ్లోబల్ డిమాండ్ పెరుగుతుండటంతో, విశాఖ ప్రపంచ పటంలో కీలక హబ్గా ఎదగడానికి ఇది అత్యంత అనుకూల సమయమని లోకేశ్ వివరించారు. అలాగే, ప్రముఖ క్లౌడ్ సేవల దిగ్గజం సేల్స్ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో కూడా ఆయన భేటీ అయ్యారు. విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) స్థాపనకు అనువైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన వర్క్ఫోర్స్ అందుబాటులో ఉన్నాయని వివరిస్తూ, సంస్థ పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెట్టారు. విజాగ్ను తూర్పు తీరంలో ప్రధాన టెక్ ప్రవేశ ద్వారంగా నిలపడానికి ఈ విదేశీ పెట్టుబడులు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం
రాజధాని అమరావతిలో అభివృద్ధి చేస్తున్న “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్ట్పై లోకేశ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచ నాయకులలో ఒకటైన రిగెట్టి కంప్యూటింగ్ సీటీవో డేవిడ్ రివాస్తో సమావేశమై, అమరావతిలో ఈ రంగానికి సంబంధించిన పరిశోధన విభాగాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్ సాంకేతికతగా పేరుగాంచిన క్వాంటమ్ కంప్యూటింగ్లో పెట్టుబడులు పెడితే, ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
క్రియేటర్ ఎకానమీకి ఏపీ మద్దతు కాన్వాను ఆహ్వానించిన లోకేశ్
డిజిటల్ క్రియేటర్ ఎకానమీ విస్తరిస్తున్న నేపథ్యంలో, అమరావతిలో అభివృద్ధి చేస్తున్న “ఎంటర్టైన్మెంట్ సిటీ”లో భాగంగా రూపొందిస్తున్న “క్రియేటర్ ల్యాండ్” ప్రాజెక్ట్పైనా మంత్రి ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాత డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా ప్రతినిధులతో సమావేశమై, యువత నైపుణ్యాభివృద్ధికి, క్రియేటివ్ టెక్నాలజీలలో శిక్షణ అందించడానికి సహకరించాలని కోరారు. దీని ద్వారా రాష్ట్రంలో కొత్త తరహా స్టార్ట్అప్ వెలసే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో అవకాశం.. ఓమియంకు ఆహ్వానం
పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ రంగం భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం అవుతుందని చూస్తూ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను ఏపీ పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేయాలని ఓమియం కంపెనీ సీఎస్టీవో చొక్కలింగం కరుప్పయ్యను విజ్ఞప్తి చేశారు. తీరప్రాంత మౌలిక వనరులు, విస్తారమైన భూమి, పోర్టులు అందుబాటులో ఉండటం వలన ఏపీ గ్రీన్ ఎనర్జీ తయారీకి సరైన కేంద్రంగా మారవచ్చని లోకేశ్ పేర్కొన్నారు.
సంస్థల నుంచి పాజిటివ్ రెస్పాన్స్
ఈ సమావేశాలలో పాల్గొన్న సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో తమ ప్రస్తుత కార్యకలాపాలను వివరించడమే కాకుండా, ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రతిపాదనలపై తమ యాజమాన్య బృందాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అందిస్తున్న అవకాశాలు, విస్తరిస్తున్న ఐటీ వాతావరణం తమను ఆకర్షించాయని వారు పేర్కొనడం విశేషం. అమెరికా పర్యటనలో లోకేశ్ సాధించిన ఈ పురోగతి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
