Maharashtra : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేయడాన్ని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే(MP Supriya Sule) తీవ్రంగా తప్పుబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(Maharashtra assembly elections) భాజపా సాధించిన విజయానికి ఈవీఎంలు లేదా వీవీప్యాట్లే కారణమని అనుమానించడం సరికాదని ఆమె స్పష్టంచేశారు. ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి తాను వరుసగా నాలుగు సార్లు అదే ఈవీఎం వ్యవస్థ ద్వారా గెలిచానని సుప్రియా సూలే గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరుస్తుందని ఆమె అన్నారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగించే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి భాజపా ఎన్నికల కమిషన్ను దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం రిగ్గింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై కూడా వారు ప్రశ్నలు సంధించారు.
ఎన్నికలకు ముందు పారదర్శకత పెంచేందుకు కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఎన్నికలకు కనీసం ఒక నెల ముందే అన్ని రాజకీయ పార్టీలకు మెషిన్-రీడబుల్ ఓటరు జాబితాను అందించాలని, అలాగే 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేయడానికి అనుమతించే నిబంధనను రద్దు చేయాలని కోరింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెంచుతాయని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భంలో, ఈవీఎం రిగ్గింగ్పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా, అదే కూటమిలో భాగమైన ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇది ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ కొనసాగుతున్న వేళ, ఈవీఎంల విశ్వసనీయతపై వివాదం మరింత చర్చకు దారి తీసే అవకాశముందని భావిస్తున్నారు.
