Hyderabad : రాష్ట్ర శాసనసభలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు(BRS MLAs) వాకౌట్ (Walkout)చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం ప్రతిపక్ష సభ్యులకు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం నిరాకరించారని వారు ఆక్షేపించారు. సభా కార్యక్రమాల నిర్వహణలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ సభను బహిష్కరించారు. వాకౌట్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ ప్రసాద్కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గన్పార్క్కు చేరుకుని అక్కడ బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు.
సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ, శాసనసభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం సభ నిర్వహణలో ఆ సూత్రాలు పాటించడంలేదని విమర్శించారు. ఏడు రోజుల పాటు సభ నిర్వహణపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ)లో సరైన చర్చ జరగలేదని తెలిపారు. సభలో చర్చించబోయే అంశాలు, బిల్లుల వివరాలను కనీసం 24 గంటల ముందే సభ్యులకు పంపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తమ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదని, ప్రశ్నోత్తరాల సమయంలో కూడా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.
ప్రతిపక్షం తమ అభిప్రాయాలను వ్యక్తపరచేందుకు ప్రయత్నిస్తే మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల ప్రజాస్వామ్య హక్కు అని హరీశ్రావు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా నిరోధించడం ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నమేనని విమర్శించారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, అందులో ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య సముచిత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిణామాలతో శాసనసభ సమావేశాలు మరింత రాజకీయ ఉద్రిక్తతల మధ్య కొనసాగనున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
