Supreme Court: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 2020లో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో (Delhi riots case) సుప్రీంకోర్టు సోమవారం అత్యంత కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్ మరియు శర్జీల్ ఇమామ్కు బెయిల్ మంజూరు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా నిరాకరించింది. అయితే అదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేస్తూ కొంత ఊరట కల్పించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్రలో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ పాత్రపై బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇతర నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై ఉన్న అభియోగాల స్వరూపం భిన్నంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సముచితమేమీ కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన నిరసనలు క్రమంగా హింసాత్మక అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయాలపాలయ్యారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్యకు గురవడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
వీరిలో కొందరికి గతంలోనే కోర్టులు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ సహా ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు డిసెంబరు 10న తీర్పును రిజర్వ్ చేయగా, తాజాగా తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఖాలిద్, ఇమామ్కు బెయిల్ నిరాకరిస్తూనే, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రహమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం స్పష్టమైన భేదాన్ని చూపించింది.
