AB Venkateswara Rao: రాష్ట్ర పురోగతికి తన ఆలోచనలతో ఏకీభవించే వారందరితో కలిసి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీ(new political party)ని స్థాపించనున్నట్లు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఈ సభకు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, యువత, మేధావులు హాజరయ్యారు. తాను గత ఏడాది ఏప్రిల్ 13న చేసిన రాజకీయ ప్రవేశ ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని వెంకటేశ్వరరావు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ ఏర్పాటు కోసం అవసరమైన అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక వనరుల సమీకరణ పూర్తయ్యాక అధికారికంగా పార్టీని ప్రారంభిస్తామని వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపన ప్రజల నమ్మకంపై విలువల ఆధారంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు, ఆలోచనలు వ్యక్తపరచేందుకు విజయవాడ కేంద్రంగా ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ప్రజల నుంచి నేరుగా సూచనలు తీసుకునే విధంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. రాజకీయాల్లో కొత్త ఆలోచనలు, నూతన దృక్పథం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిస్థితులపై కూడా వెంకటేశ్వరరావు తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన దేశాలు చిన్న దేశాలపై దాడులు చేస్తున్న ఈ కాలంలో భారతదేశం అంతర్గతంగా బలంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భద్రత, ఆర్థిక స్వావలంబన, సామాజిక సమతుల్యత ఇవన్నీ సమగ్ర అభివృద్ధికి కీలకమని చెప్పారు.
అభివృద్ధి అనేది కేవలం కార్పొరేట్ సంస్థల ఎదుగుదలకే పరిమితం కాకూడదని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు అందరూ సమాన అవకాశాలు పొందినప్పుడే రాష్ట్రం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, బాధ్యతాయుత పాలనపై ఆధారపడి పనిచేస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలతో కలిసి ప్రయాణించడమే తన లక్ష్యమని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
