బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ప్రధాని మోదీ (PM Modi) చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేస్తున్నారని, మోదీ స్ఫూర్తితోనే తెలంగాణలో బీజేపీ (Telangana BJP) బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (State Chief) రాంచందర్ రావు (Ram Chander Rao) స్పష్టం చేశారు. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మోదీనేనని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం(Party State Office)లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం కేసీఆర్గ ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
కేసీఆర్ సమగ్ర కుల సర్వే చేపట్టి కూడా, వాటిని నివేదిక బయటపెట్టలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారని, కానీ.. కేసీఆర్ 52 శాతం మంది కంటే ఎక్కువగా ఉన్నారని అసెంబ్లీలో నోరుజారారని, వెంటనే సముదాయించుకుని కేవలం 38 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పాలని చూసి దొరికిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో జరగనే లేదని ఆరోపించారు.
ఎలా పూర్తి చేశారో ఎవరికి తెలియదని అభిప్రాయపడ్డారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుందనని, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. 42 శాతం పక్కాగా ఓన్లీ బీసీలకే ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.