IndiGo Crisis: నిర్వహణపరమైన లోపాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. మూడు రోజులుగా విమాన సర్వీసులు(Air services) భారీగా ప్రభావితమవడంతో ప్రయాణికుల పడిగాపులు మరింత పెరిగిపోయాయి. పరిస్థితి మెరుగుపడకపోవడంతో శుక్రవారం మరో 400 పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. వీటిలో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే రద్దైనట్టు సమాచారం. సాధారణంగా రోజుకు 230కిపైగా ఇండిగో ఫ్లైట్లు బయల్దేరే ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి శుక్రవారం దాదాపు అన్ని దేశీయ సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. అలాగే బెంగళూరు నుంచి 100కిపైగా, హైదరాబాద్ నుంచి 90కిపైగా విమానాలు రద్దయినట్టు తెలిసింది.
ఇతర ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఫలితంగా ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. అయితే విమానాశ్రయాల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇండిగో కౌంటర్ల వద్ద సిబ్బంది లేక ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఇవ్వడం లేదని, ఆహారం–నీరు కూడా అందించడం లేదని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. లగేజ్ తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్టు వారు చెబుతున్నారు. లాంజ్లలో సరైన వసతులు లేక పలువరు నేలపైనే రాత్రి గడపాల్సి వస్తోంది. ఈ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్పైనా పడింది. గత ఐదు సెషన్లలో ఇండిగో షేరు ధర 9% కుప్పకూలింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్లో షేరు మరో 2.16% పడిపోయి రూ. 5,319 వద్ద కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో ఇండిగో సంక్షోభాన్ని అదుపు చేయడానికి చర్యలు ప్రారంభించింది. డీజీసీఏను ఆశ్రయించిన ఎయిర్లైన్ సంస్థ, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నుంచి ఎయిర్బస్ A320 విమానాలకు ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై డీజీసీఏ ఇంకా నిర్ణయం వెలువరించలేదు. అటు రద్దులు, ఆలస్యాలపై స్పందించిన ఇండిగో, ఈ నెల 8 నుంచి కొన్ని సర్వీసులను తగ్గించనున్నట్టు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి అన్ని ఆపరేషన్లు పూర్తిగా సాధారణ స్థాయికి చేరవని స్పష్టం చేసింది. ఇప్పటికే పడుతున్న అసౌకర్యానికి ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలిపింది. ప్రస్తుతం ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతుండగా, ఇండిగో ఎప్పుడు పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుతుందో చూడాలి.
