ఎంపీ ఈటల రాజేందర్
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) చెప్పుచేతల్లో ఇంటెలిజెన్స్ (State Intelligence wing) పనిచేసిందని, తాను హుజూరాబాద్, గజ్వేల్ ఎన్నిక (Huzurabad Gazwel Elections)ల్లో పోటీ చేసినప్పుడు తన ఫోన్ ట్యాప్ (Phone Tapping) అయిందని మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajender) ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో ప్రత్యేక దర్యాప్తు బృంద (సిట్) (Special Investigation Team) విచారణకు హాజరయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది.. తేల్చాల్సి ఉందన్నారు. బీజేపీ నాయకులు పరస్పరం మాట్లాడుకున్న సంభాషణను కూడా ఫోన్ట్యాపింగ్ చేశారని, సిట్ సేకరించిన డాటాలో ఆ కాల్స్ కూడా ఉన్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు?
అనేది గుట్టుగా విన్నారని మండిపడ్డారు. ప్రభాకర్రావు ఐపీఎస్ అధికారి కాదని, అయినప్పటికీ.. నాటి ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబీ చీఫ్గా నియమించిందని పేర్కొన్నారు. ఒక విశ్రాంత అధికారిని అంత పెద్ద పోస్టులో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, జడ్జిలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ కావడం ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్పై వేసిన సిట్ ఏడాదిన్నర నుంచి విచారణ చేపడుతున్నదని, అయినా.. కేసులో అతీగతి లేదని వాపోయారు. బీజేపీ, కాంగ్రెస్ లాలూచీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు భయటపెట్టడంలేదో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ట్యాపింగ్ బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వం దోషులకు శిక్షపడేలా చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.