భారతీయ జర్నలిజానికి ఆద్యుడు (Founder of Journalism)నారద మహాముని(Narada Maha muni) అని, ఆయన సత్యనిష్ఠను పాత్రికేయులు(Journalists) అలవర్చుకోవాలని అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నారద జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్లోని కోఠి వైఎంఐఎస్ భవనం (వీర సావర్కర్ హాలు)లో సమాచార భారతి నిర్వహించిన (Jayanthi Celebrations)వేడుకల్లో వారు మాట్లాడారు.
కార్యక్రమానికి అధ్యక్షుడిగా సమాచారభారతి అధ్యక్షుడు ఆచార్య గోపాల్ రెడ్డి, ముఖ్యఅతిథిగా విశ్రాంత ఐఏఎస్ సీహెచ్వీ సాయిప్రసాద్, విశిష్ట అతిథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి, విద్యా భారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షుడు డాక్టర్ ఛామర్తి ఉమామహేశ్వర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓ పాత్రికేయుడికి వుండాల్సిన అన్ని లక్షణాలూ నారదునిలో వున్నాయని కొనియాడారు.
నారదుడు కలహప్రియుడు అంటూ లోకంలో ప్రచారంలో వుందని, ఇది శుద్ధ తప్పు అని నొక్కి చెప్పారు. సమాచార భారతి మూడు దశాబ్దాలుగా పత్రికా రంగంపైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని, వీటితో పాటు సామాజిక సమరసత, జాతి ఔన్నత్యం, సమగ్రతను పెంచడానికి మీడియా రంగాన్ని సాధనంగా చేసుకుంటోందని వివరించారు. నారద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జర్నలిజంలో ఉత్తమ విలువలతో వున్న జాతీయ భావాలు గల పాత్రికేయులను సమాచార భారతి పక్షాన సన్మానిస్తున్నామని తెలిపారు.
చాలా సంవత్సరాల పాటు విద్యలో భారతీయత అనేదే కనిపించేదే కాదని, కానీ గత 11 సంవత్సరాలుగా కొంత మార్పు కనిపిస్తోందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని, దీంతో విద్యా రంగంలో కొంత మార్పు వచ్చిందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన చామర్తి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఫేక్ న్యూస్ విపరీతంగా వస్తోందని, దీనిని అరికట్టడానికి సమాచార భారతి కృషి చేయాలన్నారు.
దేశహితం కాని వార్తలు కూడా వస్తున్నాయని, వాటికి కౌంటర్లు ఎలా ఇయ్యాలో కూడా ఆలోచించాలని, లేదంటే తప్పుడు కథనాలు సమాజంలో వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. విద్యా భారతి ఈ పని కూడా చేస్తోందని, కౌంటర్ నెరేటివ్ను కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సమాజం ఎదగాలంటే భాగస్వాములందర్నీ కలుపుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం పిల్లల్లో వివిధ మాధ్యమాల ద్వారా విష బీజాలను నాటుతున్నారని, ఆ విష బీజాలను ఎదుర్కోవాలన్నారు.
దీని కోసం పుస్తకాలు, భారతీయ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్య అతిథి సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. నారదుడు త్రిలోక సంచారిగా వుంటూ, విషయాలన్నింటినీ సత్య నిష్ఠతో హితంగా చెబుతూ.. అన్ని వర్గాల వారికీ సమాచారాన్ని చేరవేశారన్నారు. సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలతోనే కథన నిర్మాణాన్ని చేశారన్నారు. ఈ ఆదర్శాలను ఆధారంగా చేసుకుంటూ పాత్రికేయులు కూడా ఆదర్శ స్థితికి చేరాలని అభిలషించారు.
మరోవైపు సమాజంలో ఎప్పుడూ నెగెటివ్ ఆలోచన అనేది వుండనే వుంటుందని, కానీ మనం మాత్రం మంచినే గ్రహించాలని అన్నారు. ఏఐ ద్వారా ప్రపంచానికి ముప్పు వుందని, కానీ దానిని వ్యతిరేకించలేమని, దానిలోని మంచినే స్వీకరించాలని సూచించారు. నిర్వాహకులు అనంతరం సీనియర్ పాత్రికేయులు కొరిడె మహేష్, గాండ్ల సంపత్, భాస్కర్ యోగి, డాక్టర్ కే అనిత, రాఘవేంద్రను సత్కరించారు.
కార్యక్రమంలో ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్రం ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్, తెలంగాణ ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్, సమాచార భారతి కార్యకర్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు.