Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా కొన్ని రోజుల్లో జరగనుండగా, రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు(Political parties) ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. హామీలతో, సంకల్పాలతో ఎన్నికల రణరంగం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి (NDA) తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పట్నా(Patna)లో జరిగిన భవ్య కార్యక్రమంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో ఈ మేనిఫెస్టోను బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాసవాన్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానంగా ఈ మేనిఫెస్టో (manifesto) దృష్టి సారించింది.
ప్రత్యేకంగా వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఎన్డీయే ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలపరచడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నడ్డా వెల్లడించారు. మహిళా సాధికారత, విద్యా సదుపాయాల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, బిహార్ను అభివృద్ధి పథంలో కొనసాగించడం తమ ప్రాధాన్య లక్ష్యమని అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రం ఎన్నో రంగాల్లో పురోగతి సాధించిందని, ప్రజల మద్దతుతో మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అటు ప్రతిపక్షం అయిన మహాఘట్బంధన్ కూడా తమ హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. దీంతో బిహార్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార హోరాహోరీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివే..
. రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు
. కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య
. ఏడాదికి రూ.లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా మార్చడమే లక్ష్యం. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం.
. ఈబీసీలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
. కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేలు పెట్టుబడి సాయం. మూడు విడతల్లో ఈ మొత్తం చెల్లింపు
. బిహార్లో ఏడు ఎక్స్ప్రెస్వేలు, నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు.
. 5 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు
. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు , మెడికల్ కాలేజీల ఏర్పాటు
. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

