కేంద్ర హోం మంత్రి అమిత్ షా
భారతదేశం(India)లో ఇంగ్లిష్లో మాట్లాడే వారు (English Speakers) త్వరలోనే సిగ్గుపడే రోజులు వస్తాయని, అవి త్వరలో వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Central Home Minister Amith Shah) జోస్యం చెప్పారు. తాజాగా ఆయన న్యూఢిల్లీలో మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి (Ex IAS Ashuthosh Agnihotri) రచించిన ‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
‘మన దేశ భాషలే సంస్కృతికి ఆభరణాలు. భాష అనేది లేకుండా మనం నిజమైన భారతీయులుగా ఉండలేం. దేశ భాషా వారసత్వాన్నితిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరగాలి. ఇంగ్లిష్ అనేది బానిసత్వానికి ప్రతీకగా తిరస్కరిస్తాం. మన దేశాన్ని.. మన భాషను.. మన సంస్కృతిని అర్థం చేసుకోవడం ఏ విదేశీ భాష వల్ల కాదు. సగం కాల్చిన విదేశీ భాషల వల్ల సంపూర్ణ దేశాన్ని అర్థం చేసుకోలేం. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు.
ఈ భాషా యుద్ధంలో ఆత్మగౌరవంతో భారత సమాజం తప్పక నెగ్గుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా.సొంత భాషతోనే మేం దేశాన్ని నడిపిస్తాం. ప్రపంచాన్నీ ముందుకు నడిపిస్తాం’ అని తెలిపారు.