TV Price Hike : కొత్త ఏడాదిలో కొత్త టీవీ (TV)కొనాలనుకునే వినియోగదారులకు ఇది అంతగా ఆనందకరమైన వార్త కాదు. 2026 జనవరి నుంచి టెలివిజన్ ధరలు(Television prices) పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మెమరీ చిప్ల కొరత(Shortage of memory chips), డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం వంటి పరిణామాల ప్రభావంతో టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సర్వర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా హై బ్యాండ్విడ్త్ మెమరీ (హెచ్బీఎం) చిప్లకు గిరాకీ అధికంగా ఉండటంతో, చిప్ తయారీ సంస్థలు లాభాలు ఎక్కువగా వచ్చే ఏఐ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీని ఫలితంగా టీవీలు, ఇతర వినియోగ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్ల సరఫరా తగ్గింది. సరఫరా కొరత కారణంగా ఈ చిప్ల ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి.
ఇదే సమయంలో డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారిగా 90 స్థాయిని దాటడం కూడా టీవీ పరిశ్రమపై అదనపు భారం వేసింది. టీవీ తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్ ప్యానెల్స్, మదర్బోర్డులు వంటి కీలక విడిభాగాలు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో ఈ దిగుమతుల వ్యయం పెరిగి, చివరకు వినియోగదారులపై ధరల రూపంలో ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ టీవీల ధరలు సుమారు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్.ఎస్. సతీశ్ తెలిపారు. అయితే, థామ్సన్, కొడక్ వంటి బ్రాండ్లకు టీవీలు తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా మాత్రం ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఆయన అంచనా ప్రకారం, టీవీల ధరలు 7 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత మూడేళ్లలో మెమరీ చిప్ల ధరలు ఏకంగా 500 శాతం పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 చిప్ల ధరలు సోర్సింగ్ దశలోనే 1000 శాతం వరకు పెరిగాయని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు. ఈ కొరత 2026 రెండో త్రైమాసికం వరకు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత స్టాక్ అయిపోయిన తర్వాతే కొత్త ధరల ప్రభావం పూర్తిగా వినియోగదారులపై పడుతుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
