Hyderabad : హైదరాబాద్ నీలోఫర్ హాస్పిట(Nilofar Hospital)ల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని(tea shop owner) బాబురావు (Babu Rao).తిరుమల శ్రీవారికి(Tirumala Srivaru) నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన, వజ్రాలతో పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని భక్తితో సమర్పించుకున్నాడు. ఈ విషయం తెలిసి, బాబురావును భక్తులు అభినందిస్తున్నారు. బాబురావు సమర్పించిన బంగారు యజ్ఞోపవీతం గురించే ఎందుకు చర్చ జరుగుతుంది? అసలు విషయం ఏమిటి?బాబురావు మాటల్లోనే చెప్పాలంటే.. తాను గతంలో దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే సమయంలో ‘ఆలయంలో యజ్ఞోపవీతం ఇస్తావా’ అన్న మాట వినపడిందని, దాంతో స్వామివారి ఆజ్ఞగా తనకు చెప్పారని భావించి, ఈ యజ్ఞోపవీతాన్ని నెల రోజుల్లో చేయించి తెచ్చానని చెప్పారు. ఆ విషయం అలా పక్కన పెడితే, అసలు 4.50 కోట్ల రూపాయల విలువైన వజ్ర ఖచిత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించిన బాబురావు గతం ఏమిటో తెలుసా?.
బాబురావు నీలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరాడు. చిన్ననాడే అదిలాబాద్ నుంచి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. టికెట్ లేకుండానే రైల్లో పడుకుని హైదరాబాద్ చేరుకున్న బాబురావు ఒక బట్టల దుకాణంలో పనికి కుదిరాడు. అయితే అక్కడ ఆయన్ని 15 రోజులకే తొలగించడంతో, నాంపల్లి రైల్వే ప్లాట్ఫారం మీదనే పడుకుంటూ, అక్కడే స్నానం చేస్తూ, అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత నీలోఫర్ టీ దుకాణంలో క్లీనర్ గా చేరాడు. కొన్నాళ్ల తర్వాత అతని పనితనం, చురుకుదనం, నిజాయితీ చూసి యజమాని వెయిటర్ గా ప్రమోట్ చేశాడు. తర్వాత సూపర్వైజర్ చేశాడు. ఆ తర్వాత టీ మాస్టర్ గా అతన్ని ప్రమోట్ చేశాడు. అలా బాబురావు టీ మాస్టర్ గా ఎదిగిన తర్వాత యజమాని తన దుకాణాన్ని బాబురావుకు అప్పగించి, ఆ దుకాణంలో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే అమ్మాలని ఒక షరతు పెట్టాడు. అప్పటినుంచి బాబురావుకు అదృష్టం కలిసి వచ్చి ఆ దుకాణాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేశాడు. మూడు బేకరీలు, నగరంలో ఇతర చోట్ల నీలోఫర్ టీ స్టాల్స్ నెలకొల్పి కోట్లు గడించాడు.
అయితే బాబురావు తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పటికి కూడా నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు, వారితోపాటు వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తుంటాడు. చనిపోయిన వారిని వారి బంధువులు స్వగ్రామాలకు తీసుకుపోలేకపోతే వారికి ఆర్థిక సాయం చేస్తుంటాడు. కేఫ్ పక్కనే ఉన్న ఆలయ నిర్వహణ చూస్తుంటాడు. వీటితోపాటు చాలా వరకు గుప్త దానాలు కూడా చేస్తుంటాడు. బాబురావు తన మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదు. అప్పుడప్పుడు టీ దుకాణంలో ఖాళీగా ఉన్న సమయంలో కస్టమర్లకు తన జీవితం గురించి చెప్తుంటాడు. తాను నాంపల్లి రైల్వే స్టేషన్లో తిండిలేక పనులు చేసుకుని, అక్కడే ప్లాట్ఫారం మీద పడుకుని, అక్కడే స్నానం చేసే వాడినని చెప్తుంటాడు. అతను గతం మర్చిపోలేదు. ఇప్పటికీ సామాజిక సేవలో బాబురావు తన పాత్ర తను పోషిస్తూనే ఉన్నాడు. దైవభక్తి, తన యజమాని మీద భక్తి ఇప్పటికీ ఆయనకు పోలేదు. అందుకే స్వామివారికి ఒక భక్తుడుగా ఆ కానుక తాను సమర్పించుకున్నానన్నాడు.
