end
=
Thursday, November 6, 2025
వార్తలుతీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళకు చారిత్రక విజయం
- Advertisment -

తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళకు చారిత్రక విజయం

- Advertisment -
- Advertisment -

Kerala : తీవ్ర పేదరికాన్ని (Poverty)పూర్తిగా నిర్మూలించిన భారతదేశంలోని తొలి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (State Formation Day)సందర్భంగా నవంబర్ 1న శనివారం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది కేరళ అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయమని, సామాజిక న్యాయం మరియు సమానత దిశగా రాష్ట్రం మరో ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు. 2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రారంభించిన “తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు” ఈ విజయానికి పునాది వేసిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 64,006 కుటుంబాలను ‘అత్యంత నిరుపేద’ వర్గంగా గుర్తించారు. ఆ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నాలుగేళ్ల కాలపరిమితితో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసింది. జీవనోపాధి అవకాశాలు, గృహ సదుపాయాలు, ఆహార భద్రత, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో సమగ్ర సహాయాన్ని అందించారు.

స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎం.బి. రాజేశ్ ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలుపై వివరాలు వెల్లడిస్తూ, నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం దేశంలోనే అత్యల్ప పేదరిక రేటు కేవలం 0.7 శాతం — కేరళలో ఉందని చెప్పారు. అయినప్పటికీ, ఆ తక్కువ శాతం ప్రజలను కూడా పేదరికం నుంచి పూర్తిగా బయటకు తేవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విస్తృత సర్వేలు నిర్వహించి, ఆహారం, నివాసం, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి అవకాశాలు వంటి సూచికల ఆధారంగా అత్యంత నిరుపేదలను గుర్తించింది. ఈ సర్వేల ద్వారా గుర్తించబడిన 64,006 కుటుంబాలకు చెందిన 1,03,099 మందికి ప్రభుత్వం అవసరమైన ఆర్థిక, సామాజిక, వైద్య సహాయాన్ని అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో అమలైన ఈ ప్రాజెక్టు కేరళలో సమగ్ర అభివృద్ధి నమూనాగా నిలిచింది.

ప్రజల భాగస్వామ్యం, స్థానిక సంస్థల చురుకైన పాత్ర, సమన్వయ విధానం వల్లే ఈ విజయం సాధ్యమైంది. పేదరికం నిర్మూలన కేరళ సమాజ స్ఫూర్తికి ప్రతీక అని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. ఈ ఘనతతో కేరళ మళ్లీ దేశానికి ఆదర్శంగా నిలిచింది. విద్య, ఆరోగ్యం, సామాజిక సమానత్వం వంటి రంగాల్లో ముందంజలో ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు తీవ్ర పేదరిక నిర్మూలనలో కూడా మార్గదర్శక రాష్ట్రంగా నిలుస్తోంది. ప్రజల సహకారం, సుస్థిర ప్రణాళిక, నిబద్ధతతో సాధించిన ఈ విజయగాథ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -