end
=
Sunday, January 18, 2026
వార్తలుజాతీయంనేషనల్‌ హెరాల్డ్‌ కేసు..న్యాయమే గెలిచింది : మల్లికార్జున ఖర్గే
- Advertisment -

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు..న్యాయమే గెలిచింది : మల్లికార్జున ఖర్గే

- Advertisment -
- Advertisment -

Congress : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు(National Herald case)లో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ(Sonia Gandhi, Rahul Gandhi)లకు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ(Ed) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. కోర్టు నిర్ణయంతో రాజకీయంగా తమపై సాగుతున్న వేధింపులకు బ్రేక్‌ పడిందని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో న్యాయమే గెలిచింది. ఇది మొదటి నుంచీ రాజకీయ కక్ష సాధింపుతోనే పెట్టిన కేసు. కాంగ్రెస్‌ను, ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేశారు అని అన్నారు. ఈ కేసులో వాస్తవ ఆధారాలు లేవని, కేవలం రాజకీయ ప్రతీకార భావనతోనే విచారణ సంస్థలను ముందుకు నెట్టారని ఆయన ఆరోపించారు.

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక చరిత్రను కూడా గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు 1938లో నేషనల్‌ హెరాల్డ్‌ను స్థాపించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ పత్రిక కీలక పాత్ర పోషించింది. అలాంటి చారిత్రక సంస్థను వివాదాల్లోకి లాగడం బాధాకరం అని అన్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను బెదిరించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కేంద్ర సంస్థల దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. చట్టాన్ని ఆయుధంగా మార్చి ప్రతిపక్షాలను అణిచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. కోర్టులే చివరికి నిజాన్ని వెలికి తెస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ, ఈ కేసు ద్వారా కక్ష సాధింపు రాజకీయాలు ఎలా సాగుతున్నాయో ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు. సత్యం దాచిపెట్టలేం. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఈ కేసు ద్వారా తమపై సాగుతున్న రాజకీయ వేధింపులు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -