Sriharikota : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)దేశ అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)కు సంబంధించిన మూడో దశ అయిన ఎస్ఎస్–3 (SS3)ను విజయవంతంగా స్థిర పరీక్ష (స్టాటిక్ టెస్ట్) నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లో ఉన్న సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ సౌకర్యంలో మంగళవారం ఈ ప్రయోగం జరిగింది. ఈ పరీక్ష ద్వారా ఎస్ఎస్ఎల్వీ మొత్తం పనితీరును మరింత మెరుగుపర్చే దిశగా ఇస్రో కీలక సమాచారాన్ని సేకరించింది.
మూడు దశలతో రూపొందించిన ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ అయిన ఎస్ఎస్ఎల్వీ, ముఖ్యంగా చిన్న ఉపగ్రహాలను వేగంగా మరియు ఖర్చు తక్కువగా కక్ష్యలోకి పంపేందుకు ఉద్దేశించబడింది. వాణిజ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, వేగవంతమైన ప్రయోగాలు, అధిక ఉత్పత్తి సామర్థ్యం ఈ వాహనానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. తాజా పరీక్షలో, మూడో దశ పనితీరును విశ్లేషిస్తూ కీలక సాంకేతిక డేటాను సేకరించినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.
ఎస్ఎస్–3 దశ పేలోడ్కు సెకనుకు సుమారు 4 కిలోమీటర్ల వేగాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దశలో చేసిన తాజా అప్గ్రేడ్లతో పేలోడ్ సామర్థ్యం సుమారు 90 కిలోల వరకు మెరుగుపడినట్లు ఇస్రో తెలిపింది. ముఖ్యంగా మెరుగైన ఇగ్నైటర్ వ్యవస్థ, ఆధునిక నాజిల్ డిజైన్ను వినియోగించడం వల్ల థ్రస్ట్ సామర్థ్యం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి ఉపగ్రహాల సమగ్ర పనితీరును మెరుగుపరచడమే కాకుండా, వాహన నిర్మాణాత్మక దృఢత్వాన్ని కూడా పెంచాయి.
ఈ స్టాటిక్ టెస్ట్ సమయంలో ఒత్తిడి (ప్రెషర్), థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి అనేక కీలక పారామీటర్లను శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. పరీక్షలో పొందిన ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని, భవిష్యత్ ప్రయోగాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఇస్రో స్పష్టం చేసింది. ఎస్ఎస్ఎల్వీ అభివృద్ధి విజయవంతమైతే, దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా చిన్న ఉపగ్రహాల ప్రయోగాల మార్కెట్లో భారత్ కీలక స్థానాన్ని సంపాదించే అవకాశాలు మరింత పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తాజా పరీక్ష ఇస్రో సాంకేతిక సామర్థ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది.
