హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో తమ హవా మొదలైందని ఆహా ఓహో అని బీరాలు పోతోందని సీఎం కీసీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శల పర్వం మరింత పదునెక్కింది. సీఎం కేసీఆర్ బీజేపీపై తెలంగాణ భవన్వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని తీవ్ర స్వరంతో ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీఆర్ఎస్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ రెండో మాసంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్లోనే సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ సమావేశానికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, మాయావతితో పాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఎవరికి ఏ డివిజన్లో బాధ్యతలు అప్పగిస్తే.. ఆ డివిజన్లో ఆయా బాధ్యులు గట్టిగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై, పార్టీపై బీజేపీ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ను అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎల్ఐసీ, రైల్వే లాంటి సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను కలుపుకొని వెళ్లాలని నేతలకు మార్గనిర్దేశనం చేశారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, 110 డివిజన్ లో టీఆర్ఎస్దే గెలుపని ఆ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇదే సమావేశంలో పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టో్లోని ముఖ్యాంశాలివే…
- రూ.1900 కోట్లతో మరో 280 కీ.మీ. మేర మిషన్ భగీరథ పైప్లైన్
- కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం
- జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ
- హైదరాబాద్లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతుల ఏర్పాటు
- రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్ల ఏర్పాటు
- త్వరలో నగరమంతా ఉచిత వైఫై సదుపాయం
- మూసీ పునరుద్దరణ, సుందరీకరణ..హుస్సెన్సాగర్ శుద్ధికి ప్రణాళిక