జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా..? అంటే ఔననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్య నేతలు భేటీ కానున్నారు. గ్రేటర్ ఉమ్మడిగా పోటీ చేయడానికే ఇరు పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్.. గ్రేటర్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. రాజధానిలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ రాజకీయ రణరంగంలోకి దిగాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ప్రధాన పార్టీలుగా బరిలో నిలవగా.. పవన్ కళ్యాన్ నేతృత్వంలోనే జనసేన పార్టీ కాస్త ఆలస్యంలో రంగంలోకి దిగింది. ఇరు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం బీజేపీ చీఫ్ బండి సంజయ్.. పవన్తో భేటీ కానున్నారు. ఈ మేరకు జనసేన తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్లో పొత్తు గురించి చర్చించనున్నారు. అలాగే కూటమి తరుఫున ప్రచారానికి సైతం ఆహ్వానించి అవకాశం ఉంది. దీనిపై ఇరు పార్టీల నేతల భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే బీజేపీతో పొత్తుపై పవన్ కళ్యాన్ ఏ విధంగా స్పందిస్తారానేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే అభ్యర్థుల జాబితాను బీజేపీ సిద్ధంగా చేయగా.. పొత్తు అనంతరం ఏ విధంగా మార్పులు చేస్తారనేది తెలియాల్సి ఉంది.